సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా మరోసారి వార్నర్‌

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 2020 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా మరోసారి డేవిడ్‌ వార్నర్‌ను నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో 2018, 2019 ఐపీఎల్‌ సీజన్లకు నాయకత్వం వహించిన కేన్‌ విలియమ్‌సన్‌ స్థానంలో వార్నర్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టునున్నాడు. ఇదే విషయాన్ని దృవీకరిస్తూ సన్‌రైజర్స్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో వార్నర్‌నుద్ధేశించి వీడియో పోస్ట్‌ చేసింది.


ఈ సందర్భంగా వార్నర్‌ స్పందిస్తూ.. ' నా మీద నమ్మకంతో జట్టు యాజమాన్యం మరోసారి తనను కెప్టెన్‌గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా. 2018 ఐపీఎల్‌ సీజన్‌కు నేను అందుబాటులో లేనప్పుడు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన కేన్‌ విలియమ్‌సన్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరోసారి కెప్టెన్‌గా జట్టును ముందుండి నడుపుతున్నా.. అందుకు మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా. నాపై నమ్మకంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి నన్ను కెప్టెన్‌ను చేసింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జట్టును ముందుకు నడుపుతా. తనకు ఇంతకాలం మద్దతుగా ఉన్న సన్‌రైజర్స్‌ అభిమానులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అంటూ తెలిపాడు.